చాలా బాధగా ఉంది.. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా: ఆషికా రంగనాథ్ | Ashika Ranganath Disappointed After Her Miss You Movie Release Postponed, Deets Inside | Sakshi
Sakshi News home page

చాలా బాధగా ఉంది.. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా: ఆషికా రంగనాథ్

Dec 2 2024 6:56 AM | Updated on Dec 2 2024 9:14 AM

Ashika Ranganath Disappointed Her Movie Miss You Postponed

దక్షిణాది చిత్ర పరిశ్రమను చుట్టేస్తున్న వారిలో మలయాళం, కన్నడ బ్యూటీలే ఎక్కువగా ఉంటున్నారన్నది వాస్తవం. ముఖ్యంగా శాండిల్‌ ఫుడ్‌ భామలు అనుష్క,కృతి శెట్టి,అనుపమ పరమేశ్వరన్, రాశీఖన్నా,  వంటివారు తెలుగు, తమిళం భాషల్లో రాణించారు. ప్రస్తుతం నటి రష్మిక మందన్న ఇండియన్‌ క్రష్‌గా వెలిగిపోతున్నారు. తాజాగా ఆషిక రంగనాథ్‌ అదే బాటలో పయనిస్తున్నారని చెప్పవచ్చు. తన మాతృభాష కన్నడలో 'క్రేజీ బాయ్‌' అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈ  బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నాగార్జునకు జంటగా నా సామిరంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. 

ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆషికా రంగనాథ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్‌ దృష్టి పడింది. ఇక్కడ నటుడు అధర్వకు జంటగా పట్టత్తు అరసన్‌ చిత్రంతో రంగ ప్రవేశం చేశారు. కాగా తాజాగా నటుడు సిద్ధార్థ్‌ కథానాయకుడిగా నటించిన 'మిస్‌ యూ' చిత్రంలో నాయకిగా నటించారు. దీంతోపాటు కార్తీ సరసన సర్ధార్‌ 2, మెగాస్టార్‌ చిరంజీవితో 'విశ్వంభర' వంటి భారీ చిత్రంలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. 

కాగా మిస్‌ యూ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని నవంబర్‌ 29న విడుదల కావాల్సింది. అయితే ఇక్కడ తుపాన్‌ వంటి అననుకూల పరిస్థితులు కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీనిపై నటి ఆషీక రంగనాథ్‌ స్పందిస్తూ మిస్‌ యూ చిత్రం విడుదల వాయిదా పడటం తనకు బాధ కలిగించిందన్నారు. అయితే అంతా బాగానే జరుగుతుందని నమ్ముతున్నానన్నారు. ఇంతకుముందు నిర్ణయించిన విడుదల తేదీ కంటే ఇంకా మంచి తేదీ లభిస్తుందని భావిస్తున్నానన్నారు. అది చిత్రాన్ని అత్యధిక ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లడానికి ఉపకరిస్తుందని, ఈ విషయాన్ని గమనిస్తే మిస్‌ యూ చిత్రం విడుదల వాయిదా అనే నిర్ణయం సరైనదేనని నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement