
ప్రముఖ తమిళనటుడు బాబిసింహా కారు ఢీకొని ముగ్గురికి గాయాలు కాగా, ఏడు వాహనాలు ధ్వంసం అయిన ఘటన చెన్నై గిండి కత్తిపరా ఫ్లైఓవర్పై కలకలం రేపింది. నటుడు బాబిసింహా వద్ద పెరంబలూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు . శుక్రవారం రాత్రి బాబీ సింహా తండ్రిని ఓ చోట దింపి తిరిగి డ్రైవర్ పుష్పరాజ్ కారులో మనపాక్కంకు వస్తున్నాడు. ఈ క్రమంలో కత్తిపర ఫ్లైఓవర్ నుంచి ఆలందూరు మెట్రో రైల్వే స్టేషన్ వైపు వస్తుండగా లగ్జరీ కారు అదుపు తప్పి వంతెనపై నుంచి మరో రెండు కార్లను, ఆటోను, టూవీలర్ను పిట్టగోడను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుల్లో ఒకరికి కాలు విరిగగా , మరొకరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ యువతి కూడా గాయాలైనట్లు సమాచారం. అలాగే ప్రమాదానికి గురైన కారు, ఆటో నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ఆ ఆప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్నసెయింట్ థామస్ మౌంట్ పోలీసులు క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు . కారు డ్రైవర్ పుష్పరాజ్ను ప్రశ్నించగా మద్యం తాగి వాహనం నడిపినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పుష్పరాజ్ను అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాబీ సింహా కారులో లేరని వారు వెల్లడించారు.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో బాబీ సింహా విలన్గా నటించిన విషయం తెలిసిందే. కాగా.. ఇండియన్-2 చిత్రంలో బాబీ సింహా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో కమల్హాసన్ సేనాపతి పాత్రలో నటించగా.. ఆయనను పట్టుకునే సీబీఐ ఆఫీసర్గా బాబీ మెప్పించారు.