మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి
మెదక్జోన్: భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ దేశ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఆనాడు తెలంగాణ సమాజం సాగించిన పోరాటం, యోధుల త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. సమైక్యత అంటే సరిహద్దులు కలవడం మాత్రమే కాదు.. మనసులు కలవడం అని అన్నారు. ప్రజల మధ్య ఐక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సామరస్యం, పరస్పర గౌరవం కొనసాగినప్పుడే దేశ సమైక్యత మరింత బలపడుతుందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని తెలిపారు. ఆనాటి మహనీయుల స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


