
గ్రూపులుంటేనే మజా!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /వట్పల్లి : రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు, గ్రూపులు లేకుంటే ఆ పార్టీ అభివృద్ధి చెందదని, గ్రూపులు ఉంటేనే ఉత్సాహం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గ్రూపు తగాదాలు లక్ష్మణ రేఖ దాటవద్దని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రూ పులు ఉంటాయని, ఎన్నికలు వస్తే అన్ని గ్రూపులు ఒక్కటై పోరాడి విజయం సాధించాలని హితవు పలికారు. తాము మాత్రం అన్ని గ్రూపులకు సమాన ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయ కులు శనివారం జోగిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సంగుపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. పార్టీకి కొత్త నీరు కూడా అవసరమని అందుకే 15 శాతం కొత్తవారిని కూడా తీసుకుంటున్నామని, పాత, కొత్తల కలయికతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
సర్వేల ఆధారంగానే స్థానిక టికెట్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగానే ఈ టికెట్ల కేటా యింపు ఉంటుందని మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారి ఇంటికే స్థానిక సంస్థల ఎన్నికల టికెట్లు నడిచివస్తాయ ని తెలిపారు. చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికి కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు ఇస్తామని చెప్పారు.
పార్టీ కోసం కష్టపడిన వారిని
గుర్తించండి: కార్యకర్తలు
పార్టీ కోసం కష్టపడిన వారినే గుర్తించాలని పలు వురు కాంగ్రెస్ కార్యకర్తలు మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్ గౌడ్లకు విజ్ఞప్తి చేశారు. తమ పబ్బం గడుపుకునేందుకు పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం ఇందిరమ్మ కమిటీలకు ఇవ్వాలని కోరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్, రెడ్డిపల్లి ఆంజనేయులు, ఆవుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రూపులు, ఆధిపత్య పోరు లేకుండాపార్టీ అభివృద్ధి చెందదు
ఎన్నికలు వస్తే అంతా ఒక్కటై పోరాడాలి
పాత, కొత్త నాయకుల కలయికతోముందుకు సాగుదాం
కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్
పటాన్చెరు నాయకులు దూరం
జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పటాన్చెరు నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు దూరంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు నేతలు ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ శ్రేణులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.