
‘ఈ–పాస్’తోనే ఎరువుల విక్రయాలు
మెదక్మున్సిపాలిటీ: ఫర్టిలైజర్ దుకాణదారులంతా ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ సూచించారు. శనివారం మెదక్ రైతు వేదికలో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు సుమారు 150 ఫర్టిలైజర్ షాపు యజమానులకు ఉచితంగా ఈ–పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పాటించేందుకు 2018 నుంచి మిషన్లను వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు. ఈపద్ధతితో ఎరువులు నేరుగా రైతుకు చేరుతాయన్నారు. బ్లాక్ దందాకు చెక్ పెట్టవచ్చన్నారు. ఐపీఎల్ డిప్యూటీ మేనేజర్ మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ సబ్సిడీలను రైతులకు అందించాలన్న లక్ష్యంతో ఈ–పాస్ విధానాన్ని ప్రోత్సహించేలా తమ కంపెనీ, ఉచితంగా మిషన్లు పంపిణీ చేసిందన్నారు. మెదక్, రామాయంపేట డివిజన్లలోని సుమారు 150 షాపులకు అందచేశామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ విజయనిర్మల, టెక్నికల్ ఫర్టిలైజర్ అధికారి హర్ష, మండల వ్యవసాయ అధికారులు నాగమాధురి, బాల్రెడ్డి, హరిప్రసాద్, శ్రీనివాస్, రామలింగారెడ్డి, రాజ్నారాయణ, ఫర్టిలైజర్ షాపు యజమానులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి వినయ్