చినుకు రాలక.. మొలకెత్తలే..! | - | Sakshi
Sakshi News home page

చినుకు రాలక.. మొలకెత్తలే..!

Jun 22 2025 4:08 AM | Updated on Jun 22 2025 4:08 AM

చినుక

చినుకు రాలక.. మొలకెత్తలే..!

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రుతుపవనాలు జిల్లాను తాకి రెండు వారాలు అవుతోంది. భారీ వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెలలో ముందస్తు వర్షాలు ఊరించడంతో 70 శాతం మంది పత్తి విత్తనాలు వేశారు. పొడి దుక్కిలో విత్తనాలు వేయడంతో భారీ వర్షాలు లేక కొన్నిచోట్ల మొలకెత్తలేదు. మొలిచిన మొక్కలుసైతం మండుతున్న ఎండలకు మాడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోమారు విత్తనాలు వేయక తప్పేలాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు బోర్లు, వందల మీటర్ల మేర నీటి పైపులు, స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తూ మొక్కలను కాపాడుకుంటున్నారు. మరికొంత మంది వర్షాలకోసం ఎదురుచూస్తూ విత్తనం వేయడం లేదు. వర్షాలు కురియాలని ఊరూరా గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు.

నిరాశలో రైతులు

జిల్లా సాధారణ వర్షపాతం 111.7 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 34.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 69 శాతంలోటు నెలకొంది. జిల్లాలోని మూడు మండలాల్లో లోటు వర్షపాతం నెలకొనగా 15 మండలాల్లో 60 నుంచి 90 శాతం అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది. మృగశిర కార్తె వెళ్లి ఆరుద్ర కార్తె ఆరంభమైంది. ఈ పాటికి జోరువర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి పొర్లుతుండాలి. చెరువులు కుంటలు, ప్రాజెక్టులలో కొత్తనీరు చేరి జలమట్టం క్రమేపి పెరుగుతుండాలి. పత్తి విత్తనాలు వేసుకోవడంతో పాటు వరినారు పోసుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఎండలు మండుతున్నాయి. 38 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం మబ్బులు కమ్ముకుంటున్నా అక్కడక్కడ చిరుజల్లులకే పరిమితం అవుతోంది. ఈ ఏడాది వానాకాలం జిల్లాలో 3.33 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 86 వేల ఎకరాల్లో పత్తి, కంది, మొక్కజొన్న పంటలు విత్తుకున్నారు. ప్రస్తుతం 30 శాతం మాత్రమే పంటల విస్తీర్ణం ఉంది. ఆశించిన వర్షాలు కురిస్తే ఈ సమయానికి 1.50 లక్షల ఎకరాల వరకు పంటలు వేసుకునేవారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురుస్తాయని, సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. కానీ వర్షాల ఆలస్యంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

జిల్లాలో 69 శాతం లోటు వర్షం

జూన్‌ 1 నుంచి 30 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 195.2 మిల్లిమీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 34.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇది కూడా కొన్ని మండలాలకే పరిమితమైంది. 69 శాతం లోటుగా నెలకొంది. మృగశిర ఆరంభానికి ముందే ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసాయి. దీంతో కొంతమంది రైతులు పంటలు విత్తుకున్నారు. అనంతరం చినుకు లేక విత్తనం మొలక రాక నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల మొక్కలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో ఖరీఫ్‌ సాగులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రుతుపవనాలు వచ్చినా జాడలేని వాన

రెండు వారాలుగా రైతుల ఎదురుచూపు

69 శాతం లోటు వర్షపాతం

70 శాతం పత్తి విత్తనాలు వేసుకున్న రైతులు

గ్రామ దేవతలకు పూజలు, కప్పతల్లి ఆటలు

చినుకు రాలక.. మొలకెత్తలే..!1
1/1

చినుకు రాలక.. మొలకెత్తలే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement