
● కమ్యూనిస్టు పార్టీలను బలహీన పర్చేందుకు కుట్ర ● సీపీఐ
పాతమంచిర్యాల: పదవుల కోసం వెంపర్లాడే తత్వం ఎర్రజెండా పార్టీకి లేదని, నిస్వార్థంగా ప్రజల సమస్యలపై పోరాడమే తమ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐ పేదలు, కార్మికులు, కర్షకుల పక్షాన పోరాటాలు, ఉద్యమాలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కామ్రెడ్ గుండా మల్లేష్ ప్రాంగణంలో సీపీఐ జిల్లా నాలుగో మహాసభ శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు. సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలను బలహీన పర్చడానికి బూర్జువ పార్టీలు, కార్పొరేట్లు కుట్ర పన్నుతున్నాయని, కమ్యూనిస్టు భావజాలం చిరస్థాయిగా నిలిచే ఉంటుందని తెలిపారు. దేశభక్తులమని బీజేపీ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. సీపీఐ వందేళ్ల విజయోత్సవ మహాసభ ఖమ్మంలో ఐదు లక్షల మందితో నిర్వహిస్తామని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ తాము బలహీన పడిపోలేదని నాయకులు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో మోదీ ప్రభుత్వం హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తా నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జన నాట్యమండలి బృందం కళాకారులు ఆటపాటలతో ఆలరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ, సీపీ ఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి, మహాసభ ఆహ్వన సంఘం అధ్యక్షుడు ఖలిందర్ అలీఖాన్, నాయకులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, సుదర్శన్, లింగం రవి, లింగయ్య, చిప్ప నర్సయ్య, దాగం మల్లేష్, వీరభద్రయ్య బొల్లం పూర్ణిమ, రేగుంట చంద్రకళ పాల్గొన్నారు.