చికిత్స పొందుతూ యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Jun 22 2025 3:22 AM | Updated on Jun 22 2025 3:22 AM

చికిత

చికిత్స పొందుతూ యువకుడి మృతి

వాంకిడి: భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువకుడు చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్సై ప్రశాంత్‌ కథనం ప్రకారం..మండల కేంద్రంలోని శివకేశవ్‌నగర్‌కు చెందిన ఇటన్‌కార్‌ శంకర్‌(27) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో భార్య రెండునెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన శంకర్‌ ఈనెల 18న మద్యం మత్తులో ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. పరిస్థితి విషమించడంతో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బస్టాండ్‌లో ఒకరు..

చెన్నూర్‌: చెన్నూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఒకరు మృతి చెందినట్లు సీఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..వేమనపల్లి మండలం గొర్లపల్లి గ్రామానికి చెందిన ఆవుల కనకయ్య (30) చిన్నతనం నుంచి టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. గొర్లపల్లి నుంచి శ్రీరాంపూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం ఉదయం చెన్నూర్‌ బస్టాండ్‌కు వచ్చాడు. అక్కడే ఆరోగ్యం విషమించడంతో మృతిచెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

లారీని వెనుక నుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు

నేరడిగొండ: ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం ఆదిలాబాద్‌ నుంచి హైదరా బాద్‌ వెళ్తున్న సూపర్‌ లగ్జరీ బస్సు మండలంలోని లఖంపూర్‌ పెట్రోల్‌బంక్‌ ప్రాంతంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా, అందులో 11 మంది ప్రయాణికులు ఉండగా, నలుగురికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా, బస్సు ముందు భాగంగా దెబ్బతింది. స్థానికులు వెంటనే డ్రైవర్‌ను అంబులెన్స్‌లో నిర్మల్‌ ఏరియాస్పత్రికి తరలించారు.

జిరాక్స్‌షాప్‌ యజమాని అరెస్ట్‌

ఇచ్చోడ: ఆధార్‌కార్డుల్లో పుట్టినరోజు తేదీలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న మండల కేంద్రానికి చెందిన జిరాక్స్‌ షాప్‌ యజమాని అబ్దుల్‌ తన్వీర్‌ను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆయన కథనం ప్రకారం..తన్వీర్‌ గత కొంతకాలంగా ఆధార్‌కార్డుల్లో పుట్టినరోజు తేదీలు మారుస్తూ మోసం చేస్తున్నాడు. దాబా(బి) గ్రామానికి చెందిన మన్నె కృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పేకాడుతూ ఏడుగురు..

వాంకిడి: మండలంలోని లక్ష్మిపూర్‌ శివారులో నిర్వహిస్తున్న పేకాటస్థావరంపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 7గురిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్‌ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏఎస్సై పోశెట్టి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

దాడి కేసులో ఎనిమిది మంది..

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రం మంచిర్యాల బైపాస్‌రోడ్‌లో నివాసం ఉండే రియల్టర్‌ జగన్‌మోహన్‌రావు ఇంటి వద్ద ఈ నెల 19న రాత్రి బీఆర్‌ఎస్‌వీ సంఘం నాయకుడు దగ్గుల మధుకర్‌పై దాడి చేసిన కేసులో ఎనిమిది మందిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. దాడిలో పాల్గొన్న ఆత్మకూరి సంజీవ్‌, డీటీ సాయితేజ, బెల్లంకొండ రాకేష్‌, వినయ్‌, సురిమిళ్ల వేణు, పాదం కుమార్‌, అరికే రాకేష్‌, గుర్రాల వంశీలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇదే ఘటనలో స్థానిక ఇస్లామ్‌పుర గౌతమినగర్‌కు చెందిన ఎల్కపెల్లి సాయిపై దగ్గుల మధుకర్‌ దాడి చేశాడని ఈ నెల 20న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు.

వర్షం కోసం పూజలు

సిరికొండ: మండలంలోని కోసుపటేల్‌గూడ గ్రామస్తులు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు గంగనీళ్లను నెత్తిన పెట్టుకుని 3 కి.మీ దూరం గల సుంకిడి గ్రామంలోని శివాలయానికి తీసుకువచ్చారు. గంగానీళ్లతో శివునికి జలాభిషేకం చేశారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని మొక్కుకున్నారు.

చికిత్స పొందుతూ   యువకుడి మృతి1
1/1

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement