
తీరని మందుల కొరత
శ్రీరాంపూర్: సింగరేణిలో మందుల కొరత తీరడం లేదు. రూ.కోట్ల లాభాలు గడిస్తున్న కంపెనీలో మందుల కొరత వెక్కిరిస్తోంది. కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్లో మరింత అధ్వానంగా ఉంది. రెండు నెలలుగా బీపీకి సరిపడా గోళీలు ఇవ్వకపోవడంతో జబ్బుల బారిన పడ్డవారు అవస్థలు పడుతున్నారు. మందుల కొనుగోలులో కార్పొరేట్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ సమస్య ఏర్పడిందని కార్మిక సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీరాపూర్ ఏరియా పరిధిలో ప్రతీనెల 11 వేల మంది బీపీ మాత్రలు తీసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కార్మికులతోపాటు రిటైర్డు కార్మికులు, కుటుంబ సభ్యులు ఇందులో ఉన్నారు. మే నెలలో బీపీ, షుగర్ మందుల కొరత ఉండేది. షుగర్ మందుల కొరత తీరినా ప్రస్తుతం బీసీ గోళీల సమస్య అలాగే ఉంది. బీపీ ఉన్న వారిని ప్రతీనెల కంపెనీ దవాఖానాలో వైద్యుడిని సంప్రదించి పరీక్షించుకున్న తర్వాత వారికి నెలకు సరిపడా మందులు ఇస్తారు. ప్రస్తుతం మందుల కొరత వల్ల కేవలం పది రోజులకు మాత్రమే ముందు ఇచ్చి పంపి తిరిగి రమన్నంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే 8 కాలనీ, నస్పూర్ కాలనీల్లో డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటి ద్వారా మందులు తీసుకుంటున్న కార్మికులు రెండునెలల నుంచి సరిపడా ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ కార్మికులు వారి స్వస్థలాల నుంచి మందుల కోసం ప్రతీ పది రోజులకోసారి రావడం ఇబ్బందిగా మారింది.
బీపీ గోళీల కోసం అవస్థలు
ఇబ్బంది పడుతున్న కార్మికులు
ఇబ్బంది పడుతున్నాం
నాకు బీపీ, గుండె జబ్బు ఉంది. రెండు నెలల నుంచి మందులు సరిపడా ఇవ్వడం లేదు. ప్రతీనెల మూడు సార్లు మందుల కోసం ముల్కల్ల నుంచి ఇక్కడి ఆసుపత్రికి రావాల్సి వస్తుంది. ఇన్నిసార్లు రావడంతో ఇబ్బంది పడుతున్నాం.
– డి.లింగయ్య, రిటైర్డ్ కార్మికుడు
త్వరలో నెలకు సరిపడా ఇస్తాం
కొన్నిరోజుల్లోనే సమస్య పరిష్కారమవుతుంది. ప్రస్తుతం బీపీ మందులు మాత్రమే కొరత ఉంది. మందులు లేవని ఎవరిని తిప్పి పంపడం లేదు. నెలకు ఇచ్చే మందులు పది రోజులకు ఇచ్చి పంపిస్తున్నాం. త్వరలోనే నెల మందులు ఇస్తాం.
– పి.రమేశ్బాబు, డీవైసీఎంఓ

తీరని మందుల కొరత