‘విచారణ పేరుతో జాప్యం సరికాదు’ | - | Sakshi
Sakshi News home page

‘విచారణ పేరుతో జాప్యం సరికాదు’

Jun 21 2023 12:36 AM | Updated on Jun 21 2023 9:21 AM

మాట్లాడుతున్న అబ్దుల్‌ ఖాదిర్‌ - Sakshi

మాట్లాడుతున్న అబ్దుల్‌ ఖాదిర్‌

శ్రీరాంపూర్‌(మంచిర్యాల): విచారణ పేరుతో సింగరేణి యజమాన్యం జాప్యం చేయడం సరికాదని కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఎంవోఏఐ) ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌లోని ఇల్లందు క్లబ్‌లో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల పరిధిలోని ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీఎంవోఏఐ శ్రీరాంపూర్‌ ఏరియా అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదిర్‌ మాట్లాడుతూ శ్రీరాంపూర్‌ ఓసీపీలో ఎలాంటి సంబంధం లేని 32 మంది అధికారులకు చార్జిషీట్లు ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా నాలుగేళ్లుగా ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు.

దీంతో ఎలాంటి తప్పుచేయని అధికారులు తప్పుడు చార్జిషీట్ల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వెంటనే దీనిపై యజమాన్యం స్పందించి చార్జ్‌షీట్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏరియా జీఎం సంజీవరెడ్డికి దృష్టికి సమస్యలు తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏరియా జీఎంలు చింతల శ్రీనివాస్‌(ఆర్జీ 1), మనోహర్‌(ఆర్జీ 2), అపెక్స్‌ కమిటీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, నాయకులు చిలక శ్రీనివాస్‌, జాయింట్‌ సెక్రెటరీ చంద్రమౌళి రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement