మహబూబ్నగర్ న్యూటౌన్: రాజ్యాగం కల్పించిన కార్మికుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. మహబూబ్నగర్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా మొదటిరోజు శనివారం ఎంబీసీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 11ఏళ్లలో పేద ప్రజానికంపై అనేక భారాలు మోపిందన్నారు. వ్యవసాయ కార్మికులు, ఇతర రంగాల కార్మికుల కష్టాలు, సమస్యలు బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. దేశంలో కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి బడా కార్పోరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు అనుకూలమైన చట్టాలను తెచ్చారని, ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కులు కాపాడబడుతాయన్నారు. కార్మికులు, పేదలకు జరుగుతున్న అన్యాయంపై విస్తృతమైన అవగాహన కల్పించి పోరాటాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి కూలీలను గ్రామీణ ప్రాంతాల్లో పనికి దూరం చేసే ప్రయత్నం చేస్తోందని, వచ్చేనెల 1వ తేదీ నుంచి వీబీజీరామ్జీ పథకం ప్రారంభం అవుతుందని, ఈ పథకానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉపాధి కూలీలు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం తప్పా.. పేదల జీవన ప్రమాణాల పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్లో నిర్వహించబోయే సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధికి ప్రజాఉద్యమాలు చేయాలన్నారు.
ఆరు గ్యారంటీలు మాటలకే పరిమితం
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును పక్కనపెట్టి రోజుకో కొత్త అంశంతో కాలయాపన చేస్తుందని మాజీ ఎంపీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహబూబ్నగర్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కులం, మతం ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
కార్పొరేట్ కంపెనీలపై ఉన్న ప్రేమ పేదలపై లేదు
వీబీజీరామ్జీ చట్టాన్ని రద్దుచేయాలి
పేదల జీవన ప్రమాణాలుపెంచేందుకు చర్యలు చేపట్టాలి
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్


