ఆదాయంపైనే ద్యాస..
పట్టని రైతు గోస
వ్యవసాయ పంట దిగుబడుల క్రయవిక్రయాలకు మూలకేంద్రాలైన మార్కెట్ యార్డుల నిర్వహణ రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఒకవైపు ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుండగా.. మరోవైపు మార్కెట్లలో కనీస వసతులు కరువవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలోని బాదేపల్లి, మహబూబ్నగర్, దేవరకద్ర, నవాబ్పేట, బాలానగర్ మార్కెట్ యార్డులు అసౌకర్యాలకు నిలయాలుగా మారాయి. ఆయా మార్కెట్లకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్లు ఆదాయం లభించగా.. నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు రూ.5 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
భారంగా నిర్వహణ..
మార్కెట్ యార్డుల నిర్వహణ భారంగా మారింది. కరెంటు బిల్లులు రూ.లక్షల్లో పేరుకుపోగా.. మున్సిపాలిటీల పన్నులు సైతం చెల్లించకపోవడంతో అపరాధ రుసుం పెరుగుతోంది. అలాగే యార్డులలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు డబ్బులు లేక మురికి కూపాలుగా మా రుతున్నాయి. గోదాంల భద్రతకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లింపులు సైతం నిలిచిపోయాయి. సీసీ కెమెరా ల నిర్వహణ, తూకాలు వేసే కాంటాలతోపాటు తేమ శాతాన్ని గుర్తించే యంత్రాలను కూడా మ రమ్మతు చేయించడానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. స్టేషనరీ లేక టెండర్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నా చేబదుళ్లతో నెట్టుకొస్తున్నారు. ఇటీవల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆకస్మికంగా తాగునీటి బోరుకు కొత్త మోటారు బిగించాల్సి వచ్చింది. అయితే మోటారు కొనుగోలు బిల్లు చెల్లించలేక మొహం చాటేసే పరిస్థితి నెలకొందని పాలకమండలి పేర్కొంది.
శుద్ధజలానికీ దిక్కు లేదు..
రైతుల ద్వారా రూ.కోట్లలో ఆదాయం లభిస్తున్నా వారికి మార్కెట్ యార్డులలో కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. శుద్ధజలం, విశ్రాంతి భవనాలు, మరుగుదొడ్లు వంటివి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో విద్యుత్ దీపాల వెలుతురు కూడా లేక భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రహరీల మరమ్మతు, గేట్ల బిగింపు వంటి పనులకు నిధులు లేకుండాపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులు, పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులని చిన్నచూపో.. లేక మట్టి మనుషులు అని అలుసో.. కానీ, అధికార యంత్రాంగం అన్నదాతలకు కనీసం సదుపాయాలు కూడా కల్పించలేకపోతోంది. మార్కెట్ యార్డుల ద్వారా ధాన్యం క్రయవిక్రయాలతో రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న ప్రభుత్వం.. వాటిని విక్రయించడానికి వచ్చే రైతులకు కనీస వసతులు కల్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా అన్నదాతలు ఎండకు ఎండుతూ.. వానకు
తడుస్తూ.. అపరిశుభ్ర వాతావరణంలో ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. వీటికి తోడు
కరెంట్ బిల్లులు, ఆస్తిపన్నుల బకాయిలు పేరుకుపోగా.. గోదాంల బీమా ప్రీమియం చెల్లింపులు సైతం నిలిచిపోవడం గమనార్హం. – జడ్చర్ల
జిల్లాలోని ప్రధాన మార్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా
జిల్లాలో అస్తవ్యస్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డులు
ధాన్యం క్రయవిక్రయాలతో రూ.కోట్లలో సమకూరుతున్న ఆదాయం
నిర్వహణ కోసం ఒక్క రూపాయి విదిల్చని ప్రభుత్వం
అరకొర వసతుల మధ్య అన్నదాతల అగచాట్లు
మరోవైపు కరెంట్ బిల్లులు,ఆస్తిపన్ను పేరుకుపోయిన వైనం


