రాజోళి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడమరుసులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోమశేఖర్(22) మంగళవారం పొలంలో ఉన్న పశువుల పాకలో, పశువులకు నీరు తాగించేందుకు అక్కడే ఉన్న మోటార్ ఆన్ చేశాడు. కాగా మోటార్ ఆన్ కాగానే నీటితో పాటు ఎర్త్ రావడంతో, అక్కడి నుంచి తిరిగి వస్తున్న యువకుడు షార్ట్ కొట్టి అక్కడే పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు శాంతినగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి వివాహం జరిగి ఏడాది కూడా పూర్తికాలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


