ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యానికి బాలుడు బలి | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యానికి బాలుడు బలి

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

ఆత్మకూర్‌: ఆటోడ్రైవర్‌ అజాగ్రత్త వల్ల 18నెలల బాలుడు మృత్యువాతపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. వనపరిజిల్లా కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ ట్రాలీ ఆటోలో ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో ఉల్లిగడ్డలు విక్రయించాడు. ఈక్రమంలో గ్రామానికి చెందిన తెలుగు సురేష్‌ దంపతులు ఉల్లిపాయలు కొనుగోలు చేసుకునేందుకు.. ఆటో వద్దకు వచ్చాడు. వారి 18 నెలల కుమారుడు అజయ్‌ అక్కడే ఆడుకుంటుండగా.. అది గమనించని డ్రైవర్‌ ఆటోను వెనక్కి నడపడంతో అక్కడే ఆడుకుంటున్న అజయ్‌పైకి టైరు ఎక్కడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని ఆత్మకూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జయన్న తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రాజాపూర్‌: మద్యం మానేయాలని కుటుంబ సభ్యులు మందలించడంతో పురుగులమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మంగళవారం అగ్రహారం పొట్లపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రమేష్‌(27) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీలో పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు తాగుడు మానాలని మందలించడంతో నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఉన్న యాసిడ్‌ను తాగి ఆయసపడుతుండగా కుటుంబ సభ్యులు గమనించి జిల్లా ఆస్పత్రికి తలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి ఎర్రోళ్ల మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement