మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లోని శ్రీలహరి మైదానంలో మంగళవారం జరిగిన హెచ్సీఏ బీ–డివిజన్ టీ–20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్లో మహబూబ్నగర్ జట్టు 20 పరుగుల తేడాతో గెలాక్సీ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. జట్టులో ఎస్.వర్షిత్రెడ్డి 37 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్తో 49 పరుగులు, ఎ.శ్రీకాంత్ 33 పరుగులు సంజయ్ 22 పరుగులు, సాయివంశీ 21 పరుగులు చేశారు. గెలాక్సీ బౌలర్లు పి.విశాల్ 3, రమణ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన గెలాక్సీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేసింది. మహబూబ్నగర్ బౌలర్లు శశాంక్ 2, జశ్వంత్ 2 వికెట్లు తీశారు. టీ–20 లీగ్లో జిల్లా జట్టు మ్యాచ్ గెలుపొందడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.


