
వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
పాన్గల్: బొలెరో ఢీకొని వృద్ధురాలు మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన గడ్డం సాయమ్మ(70) గ్రామ పంచాయతీ వద్ద ఆసరా పింఛన్ తీసుకునేందుకు వెళ్తోంది. దొండాయిపల్లి నుంచి వస్తున్న బొలేరోకు ఎదురుగా స్కూల్ బస్సు రావడంతో రివర్స్ తీసుకునేక్రమంలో వెనుక నడుచుకుంటూ వెళ్తున్న సాయమ్మను బలంగా ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు గడ్డం స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుటుంబాన్ని మాజీ సర్పంచ్ రాములు, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలోవ్యక్తి దుర్మరణం
అమరచింత: మండలంలోని పాంరెడ్డిపల్లే గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉంద్యాలకు చెందిన వెంకటేశ్ (52) అమరచింతలోని వైన్షాపులో పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి పనిముగించుకొని ఉంద్యాలకు బైక్పై వెళ్తుండగా పాంరెడ్డి పల్లే గ్రామం దాటిన తర్వాత కెనాల్ సమీపంలో బైక్కు ఎదురుగా పంది అడ్డురావడంతో తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. తలకు గాయం కావడంతో చికిత్స కోసం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్త్రావంతో మృతి చెందాడు. మృతుడి భార్య బండారి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాములు తెలిపారు.
కానిస్టేబుల్కు రిమాండ్
గట్టు : మండల పరిధిలోని చిన్నోనిపల్లె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్గౌడును శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. ప్రియాంక అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొకుండా నిరాకరించిన వ్యవహారంలో రఘునాథ్గౌడుతో పాటుగా కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గద్వాల డీఎస్పీ మొగులయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టి కానిస్టేబుల్ రఘునాథ్గౌడును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
బాలిక అదృశ్యం:
కేసు నమోదు
బల్మూర్: మండల కేంద్రానికి చెందిన బాలిక అదృశ్యమైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం బహిర్భూమికి కోసం బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకీ తిరిగి రాక పోవడంతో కుటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
అదనపు కట్నం కోసం
వేధింపులు
తిమ్మాజిపేట: మండలంలోని గొరిటకు చెందిన జక్సాన బేగంను భర్త, అత్త, మామ, ఆడపడుచులు అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జక్సాన బేగంను మహబూబ్నగర్ మండలం ఎదిర గ్రామానికి చెందిన పైసల్కు ఇచ్చి వివాహం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా తన భర్త అదనపు కట్నం కోసం అత్త వేధిస్తుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుకెస్ఐ తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన శివ, ప్రశాంత్ బైక్పై వెళ్తుండగా ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ప్రమాదంలో బైక్పై ఉన్న శివకు తీవ్రగాయాలు కాగా ప్రశాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. శివను నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో యెన్నం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
తిమ్మాజిపేట: మండలంలోని లక్ష్మణ్నాయక్ తండాకు చెందిన ముడావత్ లాలు బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొనడంతో లాలు తలకు, చేతికి గాయం అయినట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం లాలు వ్యవసాయ పొలంలో పనులు ముగించుకొని ఇంటికి బైక్పై వస్తుండగా వెనుక నుంచి కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో లాలు గాయపడ్డాడు. చికిత్స కోసం జడ్చర్ల లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లాలు భార్య ముడావత్ మన్నీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి