
జూరాలకు పెరుగుతున్న వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం ఎగువ నుంచి వస్తున్న వరద కాస్త పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం 1.34 లక్షల క్యూసెక్కులు ఉండగా.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో 1.40 లక్షల క్యూసెక్కులకు చేరిందన్నారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్లు పైకెత్తి 1,19,064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు చెప్పారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27,395 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 45, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 600, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కులు విడుదల చేసినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.817 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిర్విరామంగా కొనసాగుతోంది. మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 172.074 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 204.431 మి.యూ. విద్యుదుత్పత్తి చేశామని.. ఇప్పటి వరకు 376.505 మి.యూ, విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు.
సుంకేసులకు 1.25 లక్షల క్యూసెక్కులు..
రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం 90 వేల క్యూసెక్కులు ఉండగా.. మంగళవారం లక్ష క్యూసెక్కులు దాటింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 10 గేట్లు ఒక మీటర్ మేర, మరో 11 గేట్లను 2 మీటర్ల మేర పైకెత్తి 1,22,326 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. కేసీ కెనాల్కు 1,847 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఆయన పేర్కొన్నారు.
12 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల