కర్నూలు(హాస్పిటల్): తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారమని, అవి అన్ని వ్యాధులు రాకుండా బిడ్డను రక్షిస్తాయని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం ఆసుపత్రిలోని గైనిక్ వార్డులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యానికి బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అదనపు ఆహారం లేదా నీరు అవసరం లేదన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి శిశువుకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


