● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి
కల్లూరు: బస్తిపాడు గ్రామ పొలిమేరలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై, చెట్లమల్లాపురం గ్రామంలోని జగనన్న కాలనీలో ప్లాట్లను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీసీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ ఆంజనేయులతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడం ప్రజల హక్కులపై దాడితో సమానమన్నారు. బస్తిపాడు గ్రామంలోని సర్వే నంబర్ 382లో ఉన్న సుమారుగా 1.93 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలన్నారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం అధికారుల ప్రాథమిక బాధ్యత అన్నారు. చెట్లమల్లాపురం గ్రామంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నా.. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం వైఎస్సారీసీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కల్లా వెంకట రమణారెడ్డి, నారాయణరెడ్డి, దండు లక్ష్మీకాంతరెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, శివశంకర్రెడ్డి, తిరుపాల్, పెద్దన్న, యూనస్, సాయి, తదితరులు పాల్గొన్నారు.


