ఎమ్మిగనూరు రూరల్: క్షణికావేశంలో పట్టణంలోని తేరుబజార్లో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. వంశీ, లావణ్య దంపతులకు శృతి(18), వెంకటసాయి సంతానం. వంశీ అనారోగ్యంతో ఏడు సంవత్సరాల కిత్రం మృతి చెందాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలను పనిచేసుకుంటు కష్టపడి చదివిస్తోంది. శృతి స్థానిక తిరుపతమ్మ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసింది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, ఎంసెట్ సైతం బాగా రాసినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం ఉదయం ఇంటి పైన ఉన్న గదిలో తన బంధువుల అబ్బాయితో ఫోన్లో మాట్లాడినట్లుగా సమాచారం. ఇద్దరి మధ్య ఏమి గొడవ జరిగిందో కానీ శృతి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె కోసం తల్లి లావణ్య పైకి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో కేకలు వేయ గా ఇంటి పక్కన వారు వచ్చి కిందకు దించారు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి ఘటనాస్థలితో పాటు పోస్టుమార్టం గదిలో శృతి మృతదేహాన్ని పరిశీలించారు. కుమార్తె ఆత్మహత్యకు తమ బంధువుల అబ్బాయి కారణం కావచ్చని, విచారిస్తే అసలు నిజం బయటకు వస్తుందని మృతురాలి తల్లి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


