కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో ఎలాంటి అశ్రద్ధ ప్రదర్శించరాదని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక సంక్షేమభవన్లోని తన చాంబర్లో పత్తికొండ, ఆదోని డివిజన్లకు చెందిన సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్లు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాలను మెరుగుపరచాలని, ప్రతి హాస్టల్లో వంద మంది విద్యార్థులకు తక్కువ కాకుండా ప్రవేశాలు కల్పించాలన్నారు. హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సానుకూల థృక్పథం ఏర్పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వసతి గృహ సంక్షేమాధికారి అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో పత్తికొండ, ఆదోని సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.


