ఆదోని: సర్ సర్వేలో బీఎల్ఓలు ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించరాదని, అధికార పార్టీకి లేదా ఇతర పార్టీ బీఎల్ఏలకు అనుకూలంగా వ్యవహరించొద్దని, ముఖ్యంగా ఓటర్ల సమాచారం రాజకీయ పార్టీల యాప్లోకి అప్లోడ్ చేయకుండా చూడాలని ఆదోని తహసీల్దార్ శేషఫణి హెచ్చరించారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘టీడీపీ యాప్లో ఓటర్ల వివరాలు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విధితమే. ఈ సందర్భంగా బుధవారం రాత్రి బీఎల్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ పలు సూచనలు చేశారు. ‘సర్’ సర్వేకు ఏ పార్టీ వారు వచ్చినా అభ్యంతరం తెలపొద్దని, అయితే ఓటర్ల వివరాలను వారి వ్యక్తిగత యాప్లోకి వెళ్లకుండా నిలుపుదల చేయాలన్నారు. ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంలో ఎక్కడా గందరగోళం చోటు చేసుకోకూడదని, వాటిని ఏ రాజకీయ పార్టీ బీఎల్ఏలకు ఇవ్వకూడదని ఆదేశించారు. ‘సర్’ ప్రక్రియలో ప్రతి ఒక్క బీఎల్ఓ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా అనుమానం ఉంటే సంబంధిత అధికారులను కలవాలన్నారు.


