కోసిగి/కౌతాళం: అమెరికాలో ఈనెల 15న జరిగిన విమాన ప్రమాదంలో కోసిగి మండలం తుంబిగనూరుకు చెందిన దాట్ల సుబ్రమణ్యం రాజు కుమారుడు సాయి కార్తీక్ వర్మ (26) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దాట్ల సుబ్రమణ్యం రాజు, పద్మావతి దంపతుల సొంత గ్రామం కోస్తాంధ్రలోని భీమవరం కాగా 30 ఏళ్ల క్రితం కోసిగి మండలంలోని తుంబిగనూరుకు వచ్చి స్థిరపడ్డారు. వీరి ఏకై క కుమారుడు సాయికార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరిలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. అక్కడే స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కాన్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈనెల 15న ఆదివారం సరదాగా గడిపేందుకు స్కైడైవింగ్ సహాస క్రీడలో పాల్గొనేందుకు వెళ్లాడు. స్కైడైవింగ్కు తీసుకెళుతున్న చిన్న విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలడంతో మంటలు చెలరేగి 12 మంది అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అమెరికాలో ఉద్యోగం చేస్తు చేదోడుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.


