కర్నూలు(సెంట్రల్): తక్షణమే పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఎరువులు, కరెంట్ చార్జీలను తగ్గించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరులలో భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టి రోడ్డపైనే వంటావార్పు చేశారు. కర్నూలులో జిల్లా పరిషత్ నుంచి రాజ్విహార్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని రెండింతలుగా పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఎరువులు, కరెంట్ చార్జీలను పెంచారని విమర్శించారు. ఏప్రిల్, మే నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఉండడంతో ధరలు పెంచకుండా, ఎన్నికలు పూర్తవగానే ప్రజలపై భారాన్ని మోపారన్నారు. పక్షం రోజుల్లో ఐదారు సార్లు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం అన్యాయమన్నారు. దీని ఫలితంగా నిత్యావసర వస్తుల ధరలు పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆటో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను కూడా పెంచడం దారుణమన్నారు. సర్దుబాటు పేరుతో రూ. 20 వేల కోట్ల భారాన్ని కరెంట్ చార్జీల రూపంలో చంద్రబాబు ప్రభుత్వం పెంచిందని, తగ్గించకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, సీఎం నగర కార్యదర్శి రాముడు, ఎస్యూసీఐ జిల్లా నాయకులు హరీస్కుమార్రెడ్డి పాల్గొన్నారు.


