చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టర్ డీకే బాలాజీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ రేటింగ్ మ్యాగ్జైన్ ఫేమ్ ఇండియా నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో 100 మంది జిల్లా కలెక్టర్లను అత్యుత్తమ, ఉత్తమ పనితీరు కనబరిచిన పరిపాలన అధికారులుగా పేర్కొంది. వారిలో అత్యంత ప్రతిభావంతులైన 25 మంది కలెక్టర్లను 2026 ఎడిషన్లో ప్రచురించనుంది. ఏషియా పోస్టు సహకారంతో నిర్వహించిన ఈ సర్వే దేశవ్యాప్తంగా 800 జిల్లాలను పరిశీలించి నిపుణుల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి నివేదికలు, మీడియా విశ్లేషణ ఆధారంగా వంద మంది పేర్లను ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎంపికయ్యారు. ఈ అరుదైన గౌరవం కలెక్టర్ బాలాజీకి దక్కిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్తో పాటు పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ చాంబర్లోని కలెక్టర్ బాలాజీని మంగళవారం ఘనంగా సత్కరించారు.


