● ఏకంగా రూ. 5.28కోట్ల మేర లోన్లు ● జల్సాల కోసమే చేశాడన్న డీసీపీ కృష్ణ ప్రసన్న
పటమట(విజయవాడతూర్పు): విజయవాడలోని పలు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచుల్లో 2019–26 ఏళ్ల మధ్య 26 సేవింగ్ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డ్ల ద్వారా వివిధ రూపాలలో లోన్లను తీసుకుని వాటిని చెల్లించకుండా మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.7 కోట్ల విలువైన వివిధ స్థిరాస్తులకు చెందిన 34 డాక్యుమెంట్లు, ఒక కారు, ఒక బైక్, 122 గ్రాముల బంగారం, 927గ్రాముల వెండి, 9ఏటీఎం కార్డులు, రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీస్ కమిషనేట్లో సైబర్ క్రెం డీసీపీ కె. కృష్ణ ప్రసన్న విలేకరులకు వివరాలు వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడి..
నిందితుడు గూడూరుకు చెందిన నీలం పవన్ కుమార్(45), మీ–సేవాలో పని చేసే క్రమంలో జల్సాలకు అలవాటుపడ్డాడు. తనకు వచ్చిన జీతం జల్సాలకు సరిపోక ఏ విధంగానైనా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకు ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొన్నాడు. తప్పుడు శాలరీ స్లిప్స్, ఐడీ కార్డులు మొదలైన బ్యాంక్లలో లోన్ పొందటానికి అవసరమైన పత్రాలను తయారు చేసుకొన్నాడు. వాటిని ఉపయోగించి యాక్సిస్ బ్యాంక్ గుణదల బ్రాంచ్లో 9 ఫేక్ అకౌంట్ల ద్వారా రూ.1.76కోట్లు, ఏలూరు రోడ్ బ్రాంచ్లో 10 ఫేక్ అకౌంట్ల ద్వారా రూ.1.32కోట్లు, మెయిన్ బ్రాంచ్లో 7 ఫేక్ అకౌంట్స్ ద్వారా రూ.2.20కోట్లు ఇలా మొత్తం 26 అకౌంట్ల ద్వారా సుమారు రూ. 5.28 కోట్ల వరకు లోన్ తీసుకుని వాటిని చెల్లించకుండా వచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. ఇతనిపై గతంలో గూడూరు, బందరు టౌన్, భవానీపురం, కృష్ణ లంక పోలిస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని, దర్యాప్తులో భాగంగా సదరు ప్రత్యేక బృందాలకు వచ్చిన పక్కా సమాచారంతో సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నీలం పవన్ కుమార్ను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చేపల మార్కెట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 42 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి రోడ్డుపై పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సదరు వ్యక్తిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా, అతనికి సంబంధించిన వారు కొత్తపేట పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.


