మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏషియన్ గేమ్స్–2026, వరల్డ్ కప్ స్టేజ్ 3, 4 ఆర్చరీ పోటీల్లో పాల్గొనడానికి బొమ్మదేవర ధీరజ్, టి.గణేష్ మణిరత్నం ఎంపికయ్యారని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హరియాణాలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సెలక్షన్స్లో ధీరజ్, మణిరత్నం ప్రతిభ చూపారని తెలిపారు. చెరుకూరి ఓల్గా అకాడమీకి చెందిన బొమ్మదేవర ధీరజ్ రికర్వ్ విభాగంలో 15.5 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో, తిరుపతి జిల్లా నాయుడు పేటకు చెందిన ఆర్చర్ టి.గణేష్ మణిరత్నం కాంపౌండ్ విభాగంలో 10.75 పాయింట్లు సాధించి తృతీయ స్థానంలో నిలిచి ఏషియన్ గేమ్స్–2026కు, వరల్డ్ కప్ స్టేజ్ 3,4 ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఆర్చర్లను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షురాలు నంద మూరి తేజస్విని, ప్రధాన కార్యదర్శి బీవీ రమణ, కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి, ఉపాధ్యక్షులు జి.ప్రేమ్కుమార్, శ్రావణ్కుమార్ అభినందించారు.


