
ఎన్టీటీపీఎస్ 3వ యూనిట్లో 200 రోజుల వేడుక
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ 3వ యూనిట్ నిరంతరాయంగా విద్యుత్పత్తి చేసి విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డివిజన్ ఈఈ గోగినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయోత్సవం శనివారం నిర్వహించారు. చీఫ్ ఇంజినీర్ శివ రామాంజనేయులు కేక్ కట్ చేసి ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. డీవైఈఈ కిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఈ మాట్లాడుతూ నిరంతరాయంగా 200 రోజులు విద్యుత్పత్తిని సాధించడం అరుదైన విషయమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి విజయోత్సవాలు మరిన్ని జరుపుకునేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఎస్ఈ వెంకట్రావు అభినందించారు. ఎస్ఈ గోపాల్, ఈఈలు సురేష్బాబు, వెంకయ్య, గుప్తా, కిరణ్ పాల్గొన్నారు.
ప్రైవేట్ వైద్య కాలేజీలపై విజిలెన్స్ దర్యాప్తు చేయండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉపకార వేతనాలు తిరస్కరణ, నియంత్రణ, ఉల్లంఘనలపై తెలంగాణ తరహాలో ఏపీలోనూ ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలలపై విజిలెన్స్ విచారణ చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు శనివారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగరాధాకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శరత్బాబు, ఎస్సీ సెల్ ‘సెంట్రల్’ అధ్యక్షుడు శ్యామ్బాబు రిజిస్ట్రార్ను కలిసిన వారిలో ఉన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు వైద్య విద్యాసంస్థలపై కఠినమైన పర్యవేక్షణ అవసరమని వారు తెలిపారు.
దేవస్థాన అభివృద్ధి పనులకు రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన అభివృద్ధి పనులకు వరంగల్కు చెందిన భక్తులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. వరంగల్కు చెందిన ఎం. జయలక్ష్మి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి అభివృద్ధి పనుల కోసం రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
● దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద పంపిణీకి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బి.విశ్వనాథశాస్త్రి, మహాలక్ష్మి దంపతులు శనివారం ఆలయ ఈవోను కలిసి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు.
మహానుభావులను స్మరించుకోవాలి
చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య, రంగస్థల నటుడు బళ్లారి రాఘవ వంటి మహానుభావులను స్మరించుకోవడం మన బాధ్యత అని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, రంగస్థల నటుడు బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పింగళి వెంకయ్య జాతికి ఒక పతాకం ఉండాలని గుర్తించి దాన్ని రూపొందించిన మహనీయులన్నారు. ఆయన జిల్లావాసి కావడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. బళ్లారి రాఘవ నాటక రంగ పురోగతికి విశేష సేవలు అందించారని కొని యాడారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, మచిలీపట్నం మార్కెట్యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్(నాని) తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీటీపీఎస్ 3వ యూనిట్లో 200 రోజుల వేడుక