
లోక్ అదాలత్ను విజయవంతం చేద్దాం
చిలకలపూడ(మచిలీపట్నం): జిల్లాలో వచ్చే నెల 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించి, జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి కోరారు. గురువారం సాయంత్రం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు, కక్షిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తాను విజయనగరం, విశాఖపట్నంలో పనిచేసినప్పుడు లోక్ అదాలత్ను ఎంతో అద్భుతంగా నిర్వహించామన్నారు. అదే తరహాలో కొత్త ఒరవడితో జిల్లాలో నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో జిల్లాను నిలబెట్టేందుకు పోలీసు అధికారులు, న్యాయవాదులు, బీమా కంపెనీలు, విద్యుత్తు బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ శాఖలు అందరూ సహకరించాలన్నారు.
స్టేషన్ల వారీగా కమిటీలు..
ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ కమిటీలు ఏర్పాటు చేసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ అధ్యక్షతన కోర్టు కేసులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పర్యవేక్షించాలని న్యాయమూర్తి సూచించారు. లోక్ అదాలత్ సమయంలో వీలైనన్ని ఎక్కువ కోర్టు కేసులు పరిష్కారం అయ్యేందుకు న్యాయమూర్తులతో పాటు పోలీసులు న్యాయవాదులు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. అదనపు ఎస్పీ వీవీ నాయుడు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి సూచించిన విధంగా జిల్లాలోని 2,450 కేసులను పర్యవేక్షించి స్టేషన్ల వారీగా సర్కిల్ కమిటీలను ఏర్పాటు చేసి పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామ కృష్ణయ్య, న్యాయమూర్తులు పాండురంగారెడ్డి, సుజాత, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. పోతురాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి