
పదవిలో బాధ్యతగా వ్యవహరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): పదవి ద్వారా వచ్చిన అధికారంతో బాధ్యతగా వ్యవహరించాలి తప్ప అజమాయిషీ చేయకూడదని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి.గోపీ సూచించారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం, జిల్లాకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తులకు స్వాగతం, బదిలీపై వెళ్లిన న్యాయమూర్తులకు వీడ్కోలు కార్యక్రమం బార్ అసోసియేషన్ హాలులో బుధవారం జరిగింది. తొలుత బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు అధికారం వచ్చి నప్పుడు అజమాయిషీని ఆయుధంగా కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మచిలీపట్నంతో తనకు అనుబంధం ఉందని, తన మామయ్య మచిలీపట్నంలో ఎనిమిది సంవత్సరాల పాటు పనిచేశారని పేర్కొన్నారు. తాను మచిలీపట్నం బదిలీ అయినట్లు తెలియగానే ఎంతో సంతోషించానన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పోతురాజు మాట్లాడుతూ.. తనతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్న న్యాయవాదులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. బార్, బెంచ్ సమన్వయంతో పనిచేసేలా తనవంతు కృషి చేస్తానన్నారు. తమకు న్యాయమైన సమస్యలు ఉంటే న్యాయమూర్తులకు చెప్పుకోవటంతో పాటు అవసరమైతే నిరనసనలు కూడా చేపడ్తామన్నారు. మచిలీపట్నంలో ట్రిబ్యునల్ కోర్టులు రావడానికి సహాయసహకారాలు అందించాలని న్యాయమూర్తులను కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ, ఆరో అదనపు జడ్జి పి.పాండురంగమూర్తి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఒ.వెంకటేశ్వరరావుకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. జిల్లా కోర్టు నుంచి బదిలీపై వెళ్తున్న జడ్జిలు ఎన్.మేరీ, ఎం.వి.వాహిని, సాయిశ్రీవాణిని శాలువాలతో సత్కరించారు. తొలుత మంత్రి కొల్లు రవీంద్ర బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ

పదవిలో బాధ్యతగా వ్యవహరించాలి