
● అన్నదాతల బలవన్మరణం ● అందని పరిహారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల కాలంలో అన్నదాతల బలవన్మరణాలు జరుగుతున్నాయి. పంటకు ధర రాక.. ప్రభుత్వం పట్టించుకోపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పలభారం భరించలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులకు ప్రభుత్వం రూ. 7లక్షల ఎక్స్గ్రేషియా అందించాల్సి ఉంది. ఇది సకాలంలో అందడం లేదు. దీనికి కారణం నిబంధనలు ప్రతిబంధకంగా మారడమే. ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అన్ని అర్హతలు ఉన్నా.. కొందరు అధికారులు కొర్రీలు వేస్తున్నారు. వీఆర్వో నుంచి కమిషనర్ వరకు వివిధ స్థాయిల్లో నెలల తరబడి ఎక్స్గ్రేషియా అంశం పెండింగ్లో ఉంటోంది.
వివిధ స్థాయిల్లో పెండింగ్
ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 8 మంది రైతులు, కౌలు రైతులు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదుగురు రైతుల ఎక్స్గ్రేషియా ఫైల్స్ వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్నాయి. మరో ముగ్గురు రైతులకు సంబంధించి వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలోనే ఎటూ తేలకుండా నిలిచిపోయి ఉన్నాయి. పంచనామా, పోస్టుమార్టం వంటి ప్రక్రియలు పూర్తైనా ఎక్స్గ్రేషియా ఫైల్ ముందుకు కదలడం లేదు. వత్సవాయి మండలం భీమవరానికి చెందిన పిట్టంపల్లి కోటయ్య, కొత్త వేమవరానికి చెందిన కస్తూరి గోపి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఫైల్స్ ఏ దశలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. కొడవటికల్లుకు చెందిన గుడిపాటి నాగభూషణం, కొత్తపాలెంకు చెందిన పసుపులేటి పూర్ణచంద్రరావు, గంపలగూడెంకు చెందిన చిన్ని కృష్ణ, అనుముల్లంక, షేర్మహ్మద్పేటకు చెందిన మార్తి తిరుపతిరావు, జయంతిపురంలోని నల్లమట్టి రాంబాబు ఫైల్స్ వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్నాయి.
అన్నదాత సుఖీభవ ఏమైంది..?
అధికారంలోకి రాగానే రైతులకు ఏటా రూ. 20వేలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లు ముగిశాయి. కానీ పెట్టుబడి సాయం రాలేదు. పంటలకు గిట్టుబాటు ధర ఊసే లేదు. మరింత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడకముందే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.