
కేబుల్ వైర్ల దొంగలు అరెస్టు
తోట్లవల్లూరు: పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు కత్తిరించే దొంగలను పోలీసులు పట్టుకున్నారు. రైతులకు గత కొంతకాలంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చోరులు ఎట్టకేలకు దొరికారు. మండలంలోని బొడ్డపాడు–చినపులిపాక మార్గంలో కల్వర్టు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కేబుల్ వైర్ల చోరీ వెలుగు చూసింది. ఎస్ఐ సీహెచ్ అవినాష్ తెలిపిన వివరాల ప్రకారం..గన్నవరం మండలం బుద్దవరానికి చెందిన చలందార్ల స్వామి, ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన చలమచర్ల మహేశ్వరరావు అలియాస్ మహేష్, అదే గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల బాలుడు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమకు అవసరమైన డబ్బును సంపాదించే క్రమంలో మండల పరిధిలోని లంక ప్రాంతాల్లో గల పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు చెందిన కేబుల్ వైర్లను తస్కరించడం మొదలుపెట్టారు. చోరీ చేసిన వైర్లను కాల్చి దానిలోని రాగితీగను అమ్ముకోవటానికి తీసుకెళుతూ పట్టుబడినట్లు ఎస్ఐ చెప్పారు. నిందితుల నుంచి తొమ్మిది కేజీల రాగి వైరు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
భార్య, కుమారుడుఅదృశ్యంపై కేసు
పెనమలూరు: కానూరులో భార్య, కుమారుడు అదృశ్యమయ్యారని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... కానూరు శివాలయం వీఽధికి చెందిన లంకె దుర్గాప్రసాద్, భార్య దుర్గాభవాని, 3 సంవత్సరాల కుమారుడితో ఉంటున్నాడు. ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి దుర్గాప్రసాద్ ఫోన్ మాట్లాడుతుండగా కుమారుడు ఫోన్ కావాలని అల్లరి చేశాడు. ఈ విషయమై భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది. రాత్రి దుర్గాభవాని, కుమారుడు ఇంట్లో నిద్రపోగా దుర్గాప్రసాద్ దగ్గరలో ఉన్న తల్లి ఇంట్లో నిద్రపోయాడు. అయితే 15వ తేదీ ఉదయం దుర్గాప్రసాద్ ఇంటికి రాగా భార్య, కుమారుడు కనిపించలేదు. తాను తిరిగి రానని భార్య ఇంటి గోడపై రాసింది. దుర్గాప్రసాద్ వెంటనే దుర్గాభవాని పుట్టిల్లు పామర్రుకు ఫోన్ చేయగా రాలేదని తెలిపారు. బంధువులతో కలిసి పలు ప్రాంతాల్లో వెతికినా భార్య, కుమారుడి జాడ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.