సమర్థవంతంగా కౌంటింగ్ నిర్వహించాలి
ఆసిఫాబాద్: మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గరుకుల పాఠశాలలో గల కౌంటింగ్ కేంద్రంలో రెండు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో కౌంటింగ్ హాల్లో ఐదు టేబుళ్లు ఉంటాయని, ఒక్కో రౌండ్కు 10 వార్డుల చొప్పున రెండు రౌండ్లలో 20 వార్డులు లెక్కింపు పూర్తి చేయాలని సూచించారు. సిబ్బంది ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రతీ బ్యాలెట్ పేపర్ను ఏజెంట్ల సమక్షంలో పరిశీలించి లెక్కించాలని సూచించారు. ఉదయం 6.30 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు అలోక్కుమార్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, మాస్టర్ ట్రైనర్ ఊశన్న, రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు పాల్గొన్నారు.


