
సాగు నీరు వెళ్లేదెలా..?
తగ్గిన ‘వట్టివాగు’ ఆయకట్టు
ప్రాజెక్టుల కాలువలకు మరమ్మతులు కరువు
● పిచ్చిమొక్కలు పెరిగి.. పూడిక నిండి ● లైనింగ్ ఊడిపోయి అధ్వానంగా మారిన వైనం ● ఏళ్లుగా పట్టించుకోని అధికార యంత్రాంగం ● ఆరుతడి పంటలు వేస్తున్న ఆయకట్టు రైతులు
ప్రధాన ప్రాజెక్టుల సాగునీటి కాలువలపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. పిచ్చిమొక్కలు పెరిగి పూడికతో నిండాయి. లైనింగ్ ఊడి అధ్వానంగా మారాయి. ప్రాజెక్టుల్లో నీరున్నా పొలాలకు చేరలేని దుస్థితి.
ఫలితంగా ఆయకట్టు కింద చాలామంది రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. బోర్ల కింద ఓ వైపు వరి నాట్లు వేస్తుండగా, ప్రాజెక్టుల కింద సాగు పనులు
ముందుకు సాగడం లేదు.
ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట సమీపంలో 2.89 టీఎంసీల సామర్థ్యంతో 24,500 ఎకరాలకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో వట్టివాగు నిర్మించారు. నేటి వరకు కాలువల ఆధునికీకరణ చేపట్టలేదు. ప్రస్తుతం లైనింగ్ కోల్పోయి అధ్వానంగా మారాయి. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి వరద వెళ్లలేని పరిస్థితి. తూములు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా మంది వరికి బదులుగా పత్తి వేసుకున్నారు.
పత్తి సాగు చేస్తున్న
పిచ్చిమొక్కలు పెరిగి కాలు వలు సక్రమంగా లేక నీరు ప్రవహించడం లేదు. గతంలో వరి పండించిన రెండెకరాల్లో ఈ సీజన్లో పత్తి పంట సాగు చేస్తున్న. నాతోపాటు చాలామంది పొలాలకు సాగు నీరందడం లేదు. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలు వేసుకున్నారు.
– శంకర్, మోతుగూడ, మం.ఆసిఫాబాద్
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలానికి ప్రధాన సాగునీటి వనరుగా వట్టివాగు ప్రాజెక్టు నిలుస్తోంది. అయితే మండలానికి సాగునీటిని అందించే ప్రాజెక్టు తూములు, తలుపులు దెబ్బతిన్నాయి. గతంలో పచ్చని వరిపైరుతో కళకళలాడిన పొలాలు నేడు పత్తి చేలుగా మారాయి. డీ– 6 నుంచి డీ– 12 వరకు వట్టివాగు కాలువల ద్వారా మండలంలోని పొలాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇక్కడ వట్టివాగు కాలువ కింద సాగు విస్తీర్ణం సుమారు 12వేల ఎకరాలు ఉండగా నీరు అందక రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం మూడు వేల ఎకరాలకు మించడం లేదు. ప్రధాన కాలువకు ఎగువన దెబ్బతిన్న తూములకు మరమ్మతులు చేపట్టకపోవడంతో అవసరానికి మించి సాగు నీరు పారుతోంది. నీటికి అడ్డుకట్ట వేసేందుకు తూముల వద్ద ఏర్పాటు చేసిన తలుపులు దొంగలపాలయ్యాయి. వాటి స్థానంలో కొత్త వాటిని బిగించలేదు. డిస్ట్రిబ్యూటరీ కాలవలకు మరమ్మతులు చేపట్టకపోవడం, కాలువల్లో పూడికతీత, చెత్తాచెదారం తొలగింపు పనులు లేక నీటి సరఫరాకు అడ్డంకి ఏర్పడుతోంది. ఇరిగేషన్ అధికారులు వారాబంధీ అమలుచేసే ప్రయత్నం చేస్తున్నా సాగునీరు సక్రమంగా అందడం లేదు. గతేడాది ప్రధాన కాలువలో పూడికతీత చేపట్టి తుంగ, పిచ్చిమొక్కలు తొలగించారు. అయితే డిస్ట్రిబ్యూటరీ కాలువ తూములకు మరమ్మతులు, తూములకు తలుపులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
దహెగాం(సిర్పూర్): దహెగాం మండలం కల్వాడ సమీపంలో ఎర్రవాగు, నల్లవాగులపై నిర్మించిన పీపీరావు ప్రాజెక్టు కాలువలు అధ్వానంగా మారాయి. పిచ్చి మొక్కలు పెరిగి సాగు నీరందడం లేదు. ఎడమ కాలువ ద్వారా కల్వాడ, కుంచవెల్లి, చంద్రపల్లి, పీకలగుండం, గిరవెల్లి, ఒడ్డుగూడ, లగ్గాం, పంబాపూర్, బ్రహ్మన్ చిచ్యాల, చినరాస్పెల్లి, అమరగొండ, బోగారం, బామానగర్ గ్రామాల్లోని 11,150 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. ప్రస్తుత వానాకాలం సీజన్లో సుమారు 6 నుంచి 7 వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. ప్రధాన కాలువల్లో పూడిక నిండగా, పిల్ల కాలువలు ఆనవాళ్లు కోల్పోయాయి. ప్రాజెక్టు పూర్తిగా నిండకపోవడంతో పొలాలకు నీరు వదలడం లేదని అధికారులు చెబుతున్నారు. నీటి మట్టం 147.5 మీటర్లు కాగా ప్రస్తుతం 146.9 మీటర్లకు చేరుకుంది. వర్షాధారంగా రైతులు నారుమడులు, పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు.
నారుమడి సిద్ధం చేసిన..
భారీ వర్షాలు లేక ప్రాజెక్టులో వరద చేరలేదు. కాలువల ద్వారా సాగు నీరు వస్తలేదు. నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురుకు నారుమడి అలికిన. కాలువల్లో తుంగ గడ్డి మొలిసి అధ్వానంగా మారాయి. వానాకాలం మాత్ర మే వరి పండుతుంది. యాసంగిలో పొలాలు బీడుగానే ఉంటాయి. కాలువ ల పూడిక తీస్తే రెండు పంటలు పండిస్తం. అధికారులు జర దయ చూపాలే.
– బోరెం మారయ్య, రైతు, పీకలగుండం
తూములు.. అస్తవ్యస్తం
అధ్వానంగా పీపీరావు ప్రాజెక్టు కాలువలు
బోర్లే దిక్కు
వట్టివాగు ప్రధాన కాలువ కింద పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. డీ– 12 కెనాల్ కింద సుమారు 30 ఎకరాల వ రకు ఏటా వానాకాలం, యాసంగిలో వరి పండిస్తున్నా. పొలానికి వట్టివాగు కాలవల ద్వారా సాగునీరు వచ్చే అవకాశం ఉన్నా ఎగువ నుంచి పూర్తిస్థాయిలో అందడం లేదు. 12 ఎకరాల పొలానికి అయితే చుక్కనీరు రాదు. దీంతో పొలంలో వేసుకున్న బోర్ల ద్వారానే పంట పండిస్తున్నాం.
– వల్లూరి శ్రీనివాస్, కౌలు రైతు

సాగు నీరు వెళ్లేదెలా..?

సాగు నీరు వెళ్లేదెలా..?

సాగు నీరు వెళ్లేదెలా..?

సాగు నీరు వెళ్లేదెలా..?

సాగు నీరు వెళ్లేదెలా..?