
జిల్లాకు అవార్డులు
సంపూర్ణతా అభియాన్లో
ఆసిఫాబాద్: కలెక్టర్ వెంకటేశ్ దోత్రే రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. సంపూర్ణతా అభియాన్లో అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం అవార్డుల్లో భాగంగా రాష్ట్రంలోని 10 జిల్లాలు ఎంపిక కాగా, అందులో జిల్లాలోని తిర్యాణి బ్లాక్ కూడా ఉంది. ఈ క్రమంలో 5 పాయింట్లు సాధించిన జిల్లా సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. అలాగే సంపూర్ణతా అభియాన్ సమ్మాన్ సమారోహ్లో భాగంగా అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అవార్డుకు ఎంపిక కాగా, బ్రాంజ్ మెడల్ దక్కింది. శనివారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డులు అందుకోనున్నారు.
తిర్యాణి బ్లాక్లో అభివృద్ధి పనులు
పౌరుల జీవన నాణ్యతను మెరుగుపర్చడం కోసం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దేశంలోని 500 బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రెండేళ్ల కింద తిర్యాణి మండలాన్ని ఏబీపీగా ఎంపిక చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్లో దక్షిణ జోన్లో ప్రథమ స్థానం, దేశవ్యాప్తంగా నాలు గో స్థానంలో నిలిచింది. ఉత్తమ బ్లాక్గా ఎంపిక కావడంతో అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. 9 రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ఆర్థికాభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ అంశాలపై దృష్టి సారిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో అంతరాయం ఏర్పడకుండా నీతి ఆయోగ్ ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ ఆరు నెలల ఒకసారి క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమంపై సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడు అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తున్నారు. మహిళలకు వందశాతం రుణాలు అందజేస్తున్నారు. భూసార పరీక్షలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వినియోగించుకుంటున్నారు.
నేడు గవర్నర్ చేతుల మీదుగా స్వీకరణ

జిల్లాకు అవార్డులు