రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి
● మధిరకు త్వరలోనే డెవలప్మెంట్ కమిటీ ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మధిర: మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్గా, అత్యంత అనువైన నివాస యోగ్యమైన పట్టణంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. మధిరలో సోమవారం నూతన కౌన్సిలర్లతో సమావేశమైన ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు అఖండ విజయాన్ని చేకూర్చిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలిపారు. అత్యంత బాధ్యతగా పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత.. ఈ మూడు అంశాల ఆధారంగా మధిర వాసులకు మెరుగైన పాలన అందిస్తామన్నారు. కాగా, మధిర పట్టణాన్ని భవిష్యత్ తరాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దేలా పాలకవర్గ బాధ్యులు ఇకపై రాజకీయాలను పక్కన పెట్టి కేవలం అభివృద్ధి నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మధిరను అభివృద్ధి చేసేందుకు పట్టణంలోని పెద్దలు, మేధావులతో రాజకీయాలకు అతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ చేయాల్సిన అభివృద్ధిపై పాలకవర్గానికి సలహాలు, సూచనలు ఇస్తుందన్నారు. అంతేకాక ప్రతీనెల తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోనా ధనికుమార్, మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, సూరంశెట్టి కిషోర్, మిరియాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వైరా అభివృద్ధి బాధ్యత నాదే...
వైరా: వైరా మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైరా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై న డాక్టర్ కాపా చంద్రకళ, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్నాయక్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు మధిరలో భట్టిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం సంపూర్ణంగా అందజేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తానన్నారు. లయన్స్క్లబ్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్ కాపా మురళీకృష్ణ, చంద్రకళ దంపతులు రాజకీయాల్లోనూ రాణించాలన్నారు. కౌన్సిలర్లు, నాయకులు ఉండ్రు వరలక్ష్మి, నిమ్మతోట శ్రావణి, లగడపాటి లక్ష్మీరాజ్యం, లగడపాటి ప్రభాకర్రావు, శీలం చంద్రశేఖరరెడ్డి, వేముల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.


