కూసుమంచి: ప్రస్తుత సమాజంలో చదువుకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. వ్యక్తులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, సమాజానికి ఉపయోగపడాలన్నా చదువే కీలకంగా నిలుస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మండలంలోని పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించగా విద్యాలయ చైర్మన్ అయిన కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మానవాళి జీవన ప్రమాణాలు పెరగాలన్నా, అస్థిత్వాన్ని కోల్పోకుండా ఉండాలన్నా చదువు తప్పని సరన్నారు. ప్రస్తుత తరానికి ప్రభుత్వాలు అనేక అవకాశాలు కల్పిస్తున్నందున శ్రద్ధగా చదువుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే, ఏ స్థాయికి చేరినా తల్లిదండ్రులు, గురువులను మరిచిపోవద్దని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. విద్యాలయ ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, పేరెంట్, టీచర్స్ కమిటీ సభ్యులు రవీందర్రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నవ సమాజ నిర్మాతలు మీరే..
ఖమ్మం సహకారనగర్: అధ్యాపకులు కేవలం విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాక వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి నవ సమాజ నిర్మాతలుగా నిలవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లాలో ఇటీవల జూనియర్ అధ్యాపకులుగా విధుల్లో చేరిన 58మంది కలెక్టర్ను శుక్రవారం కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమమైన అధ్యాపకులుగా రాణిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు, సీపీఎస్ ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
‘నవోదయ’ వార్షికోత్సవంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్