రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి పరిస్థితులతో రైతులు దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా, భీమా, దూద్ గంగా, కాగిణా నదులు ఉగ్రరూపం దాల్చాయి. పలు వంతెనలు నీటమునిగాయి. ఆల్మట్టి జలాశయం నిండుకుండలా మారింది. బెళగావి జిల్లా నిప్పాణి తాలూకా కరదగా బెంగాలీ బాబా దర్గా నీటిలో మునిగింది. మహారాష్ట్రలోని రాజాపుర డ్యాం నుంచి 91 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదిలారు. యాదగిరి జిల్లాలోని భీమా నదిలోకి వరద నీరు చేరాయి. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలోని పలు జిల్లాధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడుతుండడంతో ఏ సమయంలోనైనా నదుల్లో వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే ిశివకుమార్ ఆదేశించారు. విజయపుర, యాదగిరి, రాయచూరు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. శహాపుర తాలూకా శంకర్వాడి వద్ద కాగిణా నదిపై వంతెనకు ఆనుకుని వరద నీరు ప్రవహిస్తున్నాయి.
వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూపులు
తన 10 ఎకరాల పొలంలో పత్తి పంట వేశానని, వర్షం కోసం ప్రతి నిత్యం ఆకాశం వైపు చూడడం తప్ప ఒక్క బొట్టు వర్షం కూడా రావడం లేదని రైతు అబ్బాస్ అలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 రోజుల క్రితం పడ్డ చిరు జల్లులకు పత్తి విత్తనాలు పెట్టాం. ఆకాశంలో మేఘాలు కారు మబ్బులు కమ్మినా వరుణ దేవుడు కరుణించక పోవడంతో ఆకాశం వైపు చూస్తూ కాలం గడపాల్సి వస్తోందని తెలిపారు. కళ్యాణ కర్ణాటకలో 1,77,343 హెక్టార్లలో, రాయచూరు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లలో రైతులు విత్తనం వేయక పొలాలు బీళ్లుగా మారాయి. రైతులు తొలకరి వానలకు ఐదు వేల హెక్టార్లలో విత్తనం వేశారు. జూన్లో వానలు పడగా రైతులు పత్తి, కంది, సూర్య కాంతి, సజ్జ, వేరు ఽశనగ పంటలు వేసుకున్నారు. వానలు లేక పంటలు వాడుముఖం పట్టడంతో పొలంలో రైతులు నీళ్లను నీటి ట్యాంకరు, చెంబులతో మొక్కలకు నీరు పోసి వాటిని కాపాడుకుంటున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న కాగిణా నది
వర్షాలు కురవక పత్తి మొక్కలు వాడుముఖం
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు
ఉగ్రరూపం దాల్చిన కృష్ణా, దాని ఉప నదులు
కల్యాణ కర్ణాటకలో ముఖం
చాటేసిన వరుణుడు
దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్న అన్నదాతలు


