హొసపేటె: ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని బీఎంఎం (బీఎంఎం) ముఖ్య కార్యనిర్వహణ అధికారి మంజునాథ్ ప్రభు అభిప్రాయపడ్డారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో భాగంగా బీఎంఎం ఇస్పాత్, ప్రభుత్వ ఆస్పత్రి, బళ్లారిలోని విమ్స్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో గురువారం వృత్తి విద్యా ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛంధ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు సహాయం అందుతుందన్నారు. ఇది మానవతా దృక్పథంతో కూడిన ఒక మంచి పని. రక్తదానం చేయడం ఆరోగ్యానికి నిజంగా ప్రమాదకరం కాదు.. ఇది ఒక సేవ, నిస్పార్థమైన చర్య అని తెలిపారు. మానవ ప్రాణాలను కాపాడే శక్తి రక్తానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి అయిన ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం సామాజిక సేవకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వహణ అధికారి విమల్ సింగ్, ఆర్థిక వాణిజ్య శాఖ అధిపతి రాజేంద్ర ముంద్రా, సంస్థ ఉపాధ్యక్షుడు మనీష్.డి.వర్ణేకర్, వృత్తిపర ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. పీ.విజయ వెంకటేష్, డాక్టర్.అంజని, డాక్టర్ అనూష, విజయనగర్ జిల్లా రక్త సేకరణ అధికారి డి.జగదీష్, విమ్స్ బ్లడ్ బ్యాంక్ కన్సల్టెంట్లు సిద్దేశ్వర, మల్లికార్జున కపాలి, సంతోష్, వృత్తిపర ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


