రాయచూరు రూరల్: జిల్లాలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తామని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ వే ఆఫ్ బెంగళూరు కార్పొరెట్ భాగస్వామ్యంతో రూ.20 కోట్లతో విద్య, ఆరోగ్య, తాగునీరు, మహిళా శిశు సంక్షేమ శాఖల అభివృద్ధి విషయంలో ఒప్పందాలను కుదుర్చుకున్నామన్నారు. జిల్లాలో 250 అంగన్వాడీ కేంద్రాల నవీకరణ, 1500 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఈసీసీఈ పథకం శిక్షణ శిబిరాలు, 24 సర్కారీ పాఠశాలల్లో స్పార్క్ సౌకర్యం, 13 చోట్ల ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, సర్కారీ పాలిటెక్నిక్ కళాశాల నవీకరణకు ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. ప్రభుత్వం ప్రైవేట్, సముదాయ సంస్థల సహకారంతో పనులు చేపడతామన్నారు.
కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా
హొసపేటె: దొంగతనాలు, ఇతర నేరాలను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా కూడ్లిగి పోలీస్ సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది కొత్త వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. రోడ్డుపై వెళ్లే ప్రజల కదలికలను గమనించేందుకు వీలుగా దుకాణాల ముందు అమర్చిన సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ మౌఖిక ఆదేశాల మేరకు కూడ్లిగి పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ నేతృత్వంలో ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులు ప్రధాన రహదారిపై రాత్రి గస్తీ చేపట్టారు. వాహనాల నంబరు, రిజిస్ట్రేషన్ వివరాలను తనిఖీ చేయడం ద్వారా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనబడితే పోలీసులు వారిని విచారిస్తున్నారు.


