శివాజీనగర: విధానసభ కోటాలో జరగనున్న 7 విధానపరిషత్ స్థానాల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి 5 మంది, బీజేపీ, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. విజయం కోసం భారీ లెక్కాచారాలు సాగుతున్నాయి. హస్తం పార్టీ 5వ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కొన్ని ఓట్లు కావాలి, దీంతో జేడీఎస్ మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే క్రాస్ ఓటింగ్ భయంతో కాంగ్రెస్ నాయకులు తమ ఎమ్మెల్యేలను బిడదిలోని ఓ లగ్జరీ రిసార్ట్లో ఉంచారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా దేవనహళ్ళి రిసార్టులో మకాం వేసినట్లు తెలిసింది.
రిసార్టులో మాక్ పోలింగ్
రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. 5వ అభ్యర్థిని కూడా ఎగువసభకు పంపాలని పట్టుదలతో ఉంది. అదనపు సీటు కోసం కాంగ్రెస్ నుంచి వినయ్ కార్తీక్, జేడీఎస్ పార్టీ నుంచి గోవింద పోటీ పడుతున్నారు. చెల్లని ఓటు అనే సమస్య లేకుండా, ఎలా ఓటు వేయాలనే అంశంపై ఎమ్మెల్యేలకు సీనియర్లు బోధించారు.
ఎమ్మెల్యేలకు విప్
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కుతూహలం కలిగిస్తున్న ఎగువసభ ఎన్నికల పోలింగ్ గురువారం విధానసభలో జరుగుతుంది. అందరికీ ప్రతిష్టగా మారాయి. విధానసౌధ ప్రధాన కమిటీల గదులను తాత్కాలిక పోలింగ్ బూత్లుగా మార్చారు. ఎన్నికల కమిషన్ అధికారులు పరిశీలించారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. తప్పనిసరిగా ఓటేయాలని విప్ను కూడా జారీ చేశాయి. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తక్షణమే ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది.
విధానసౌధ ఆవరణలో కోలాహలం
మూడు పక్షాలు ఆధిక్యం కోసం పోరాటం
భారీ భద్రత
పోలింగ్కు పోలీసులు, ఎన్నికల కమిషన్ భారీ భద్రతను చేపట్టారు. పోలింగ్ గదుల పరిసరాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలను అమర్చారు. ఎన్నికల ప్రక్రియను వీడియో రికార్డింగ్ తీస్తారు. ఎమ్మెల్యేలకు రహస్య ఓటింగ్ సదుసాయం కోసం రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటయ్యాయి. పార్టీల తరఫున ఏజెంట్లు బూత్లలో ఉంటారు. పోలింగ్ వేళకు రిసార్టుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సౌధకు చేరుకొంటారు.
7 స్థానాలకు 8 మంది పోటీ
ఉదయం 9 నుంచి
సాయంత్రం 5 వరకు పోలింగ్
విధానసౌధలో ఏర్పాట్లు పూర్తి
రిసార్టుల నుంచి రానున్న హస్తం
ఎమ్మెల్యేలు
అదనపు సీటు ఎవరిదోననే ఉత్కంఠ


