సాక్షి, బెంగళూరు: జీవితంలో శక్తి ఉన్నంత కాలం కష్టపడ్డారు, మలిసంధ్యలోనైనా నెమ్మదిగా, ప్రేమతో, గౌరవంగా బతకాలని వయోవృద్ధులు కోరుకుంటారు. కానీ చాలామందికి అది దురాశే అవుతోంది. పిల్లలు, ఇతర కుటుంబీకుల నుంచి నిర్లక్ష్యం, అవమానభారం, పైగా దాడుల వల్ల వయోవృద్ధులు కుంగిపోతున్నారు.
3 ఏళ్లలో 2,600 కేసులు
బెంగళూరు నగర పోలీసు శాఖ, వయోవృద్ధుల సాధికారత డైరెక్టరేట్ భాగస్వామ్యంతో సీనియర్ సిటిజెన్స్ సంక్షేమాన్ని పర్యవేక్షించే ప్రభుత్వేతర సంస్థ ‘నైటింగేల్స్ మెడికల్ ట్రస్టు’ నిర్వహించిన సర్వేలో వృద్ధులపై జరుగుతున్న దాడులు, వేధింపులు బహిర్గతం అయ్యాయి. ఈ నివేదిక ప్రకారం 2023 నుంచి 2026 వరకు మూడేళ్లలో బెంగళూరులో 2,680 మౌఖిక, లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. ఫించన్ డబ్బులు, పదవీ విరమణ డబ్బులు, ఆస్తి పంపకాల కోసం సంతానం, ఇతర బంధువులే హింసకు, అవమానానికి పాల్పడినట్లు తెలిపారు.
ఏటా కేసులు అధికం
కుటుంబ సభ్యులే దాడులు చేశారని 2023–26 వరకు మొత్తం 1,847 ఫిర్యాదులు అందాయి. పొరుగువారు, అద్దె ఇంటి వారి నుంచి 669 వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. ప్రైవేటు సంస్థలు, సంఘాలు మోసం చేయడంపై 164 ఫిర్యాదులు అందాయి. ఇలా ఇంటా బయటా వృద్ధులకు రక్షణ, గౌరవం కరువైంది. ఏటా కేసులు పెరిగాయి.
పెరుగుతోన్న వృద్ధులు
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 60 ఏళ్ల పైబడిన వృద్ధులు 68 లక్షల మంది ఉన్నారు. ఇందులో బెంగళూరులోనే 9.11 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మరింత అధికమై ఉంటారు. ఇందులో సుమారు 30,459 మంది వృద్ధులు ఏకాకులుగా జీవిస్తున్నారు. నైటింగేల్స్ మెడికల్ ట్రస్టు సహాయవాణి–1090కి గత మూడేళ్లలో సహాయం కోసం 43,626 కాల్స్ వచ్చాయి.
సంతానం, ఇరుగుపొరుగు దాడులు
వృద్ధులకు దక్కని గౌరవం, భద్రత
బెంగళూరులోనూ ఇదే ధోరణి


