కృష్ణరాజపురం: బెంగళూరులో దారుణం జరిగింది. ఆటలాడుకుంటూ రెండేళ్ల చిన్నారి పాప భవనం 2వ అంతస్తు నుంచి కిందపడిన ఘటన నాయండహళ్లిలో జరిగింది. వివరాలు నవీన్, జయశ్రీ దంపతుల కుమార్తె చిన్నారి సహన. నవీన్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుంటాడు. వీరికి ఈ పాప ఒక్కరే సంతానం. ఈ నెల 6వ తేదీ ఉదయం 7 గంటలకు భర్త పనికి వెళ్లగా, భార్య వంటింట్లో పాప కోసం పాలు వేడి చేస్తోంది. చిన్నారి పాక్కుంటూ బాల్కనీలోకి వచ్చింది. అక్కడ ఉన్న చెయిర్ను ఎక్కి, పట్టు తప్పి కిందకు పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. బయట జనం కేకలు వేయడంతో తల్లి పరుగు పరుగున కిందకు వచ్చి, గాయపడిన కూతురిని చూసి అక్కడే మూర్ఛపోయింది. వెంటనే బాలికను, తల్లిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. పై నుంచి శిశువు కిందపడడం, రోడ్డు మీద అచేతనంగా ఉన్న దృశ్యం అక్కడి సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది. చంద్ర లేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం బాలిక తండ్రి మాట్లాడుతూ బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారన్నారు. తలకు 3 కుట్లు పడ్డాయని, ఎక్కడా గాయాలు లేవని, ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పాడు.
ఐసీయూలో చికిత్స
బెంగళూరులో సంఘటన


