
ఎగువన భారీ వర్షాలు.. కృష్ణమ్మ పరవళ్లు
రాయచూరు రూరల్: గత కొన్ని రోజుల నుంచి ఎగువన మహారాష్ట్రలోని నదీ పరివాహక ప్రాంతాల్లో వానలు కురుస్తుండడంతో కృష్ణా నదికి వరద నీరు భారీగా తరలి వస్తున్నాయి. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాలతో పాటు బెళగావి జిల్లా బనహట్టి రబకవి వద్ద కృష్ణా నదీతీర లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతున్నాయి. ఆల్మట్టి జలాశయంలో 519.60 మీటర్లకు గాను ప్రస్తుతం 511.05 మీటర్లకు నీటిమట్టం చేరింది. చిక్కోడి డివిజన్లో కల్లోళ, యడూర, మలికవాడ, దత్తవాడ, నిప్పాణి తాలూకా బారవాడ, కున్నూర, కరదగ, బోజ వంతెనలు జలావృతం అయ్యాయ. ఈ మార్గంలో కర్ణాటక, మహారాష్టల మధ్య రాకపోకల సంబంధాలు స్తంభించాయి. కోల్హాపూర్ జిల్లా రాజాపూర్ డ్యాం నుంచి కృష్ణానదికి 44,125 క్యూసెక్కుల నీరు, దూద్ గంగా నదికి 15,840 క్యూసెక్కుల నీటిని వదిలారు. జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో ప్రవహిస్తున్న కృష్ణా నదిలో వరద ప్రవాహం అధికం కావడంతో రైతుల 60 పంపుసెట్లు నీటిలో మునిగాయి.

ఎగువన భారీ వర్షాలు.. కృష్ణమ్మ పరవళ్లు