
రక్తదానం ప్రాణదానంతో సమానం
బళ్లారి రూరల్ : ఒకరి రక్తదానం నలుగురికి ప్రాణదానంతో సమానమని బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ తెలిపారు. అఖిల భారత శస్త్రవైద్యుల సంఘం బళ్లారి శాఖ, బీఎంసీఆర్సీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం బీఎంసీఆర్సీ సభాభవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. యువత రక్తదానంపై అవగాహన పెంచుకొని రక్తదానం చేయాలన్నారు. ప్రమాదాల్లో గాయపడిన బాధితులు, ఆసుపత్రికి వచ్చే మహిళలకు, రోగులకు దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను కాపాడుతుందన్నారు. శిబిరంలో 130 మంది బీఎంసీఆర్సీ వైద్యులు, జూనియర్ వైద్యులు రక్తదానం చేశారు. శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ విద్యాధర కిన్నాళ్, డాక్టర్ శేఖప్ప, డాక్టర్ గురుబసవనగౌడ, డాక్టర్ మహేష్ దేశాయ్, డాక్టర్ రవి, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ డాక్టర్ బిందు, వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.
రక్తదానంపై జనజాగృతి జాతా
రాయచూరు రూరల్: రక్తదానంపై జన జాగృతి జాతాకు రిమ్స్ అధికారి విజయ శంకర్ శ్రీకారం చుట్టారు. శనివారం ఆరోగ్యాధికారి కార్యాలయం వద్ద రక్తదానంపై జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలపై ఇంటింటికెళ్లి గ్రామీణ ప్రజలకు వివరించాలన్నారు. యువత రక్తం దానం చేసినా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రక్తదానం చేయాలన్నారు. జాతాలో ఇంచార్జి జిల్లా ఆరోగ్య శాఖాధికారి గణేష్, వైద్యులు శాకీర్, ప్రజ్వల, బసయ్య, సంధ్య, సరోజ, శ్రీనివాస్ రాయచూర్కర్లున్నారు. కాగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో రోటరీ క్లబ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్పీ పుట్టమాదయ్య, రోటరీ క్లబ్ సంచాలకులు గిరీష్, త్రివిక్రం జోషి, శరణ బసవ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం