
ప్రశాంతంగా సీఈటీ పరీక్షలు
సాక్షి, బళ్లారి: ీపయూసీ అనంతరం ఇంజినీరింగ్ పాటు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరడానికి నిర్వహించే కే– సీఈటీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు జరిగే ఈ సీఈటీ పరీక్షలు ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు కొప్పళ, విజయపుర, బాగల్కోట, గదగ్ తదితర జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో జరిగాయి. వేలాది మంది విద్యార్థులు కర్ణాటక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(కే–సీఈటీ) పరీక్షలు రాశారు. బళ్లారి నగరంలోని సరళాదేవి కళాశాల, మున్సిపల్ హైస్కూల్, బీపీఎస్సీ, వార్డ్లా తదితర తొమ్మిది సెంటర్లలో దాదాపు ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలు జరిగాయి. పీసీఎంసీ చదివిన విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పరీక్షలు రాయనుండగా, పీసీఎంబీ చదివిన విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ నాలుగు సబ్జెక్ట్లు రాయనున్నారు.
నేడు మ్యాథ్స్, బయాలజీ పరీక్షలు
గురువారం మ్యాథ్స్, బయాలజీ పరీక్షలు జరగనున్నాయి. పీసీఎంసీ చదివిన విద్యార్థులు సీఈటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే రాష్ట్రంలో పేరుగాంచిన ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఉండటంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పీసీఎంబీ చదివిన విద్యార్థులు సీఈటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే ఏజీబీఎస్సీ, పారా మెడికల్ కోర్సులు చేయడానికి అర్హత సాధిస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్ష కేంద్రాలకు హాజరై పరీక్షలు రాశారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగియగా, రెండో రోజు సీఈటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరు
పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు