
పట్టుబడిన బియ్యం లోడు లారీలు
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా షాపూర్లో మంగళవారం నల్ల బజారుకు అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని అధికారులు భారీ ఎత్తున పట్టుకున్నారు. రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న షాపూర్లోని ఎఫ్సీఐ గోదాముల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలకు అన్న భాగ్య పథకం కింద పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రెండు లారీల్లో నల్లబజారుకు తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు వాటి విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని తేల్చారు. ఈ విషయంపై జిల్లాధికారి సుశీల మాట్లాడుతూ షాపూర్ ఎఫ్సీఐ గోడౌన్లలో సీసీ కెమెరాలు అమర్చలేదన్నారు. బియ్యం అక్రమంగా నల్లబజారుకు తరలిస్తుండగా పట్టివేత అంశంపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు.