జైలుదిద్దిన జీవితాలు!
30 మందికి ఉపాధి
కటకటాల్లోకి వెళ్లాం.. కటిక చీకటి చూశాం.. జీవితం ముగిసిపోయిందని కుంగిపోలేదు. చేసిన తప్పును తెలుసుకున్నారు. పరివర్తన చెందాలనుకున్నారు. శిక్ష అనంతరం ఆదర్శంగా బతకాలనుకున్నారు. ఖైదీల ఆశయానికి జైలు అధికారులు ఊతం ఇచ్చారు. చిన్నపాటి సాయాన్ని పట్టుకొని అంధకారంలో నుంచే ఉపాధి వెలుగులు వెతుక్కున్నారు. శిక్షకాలం పూర్తయిన తర్వాత సమాజంలోకి అడుగుపెట్టిన వారు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ గౌరవప్రదంగా బతుకుతున్నారు. కరీంనగర్ జైలు నుంచి విడుదలైన 30 మంది ఖైదీలు జైలు పెట్రోల్బంకులో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. సమాజంలో
గౌరవప్రదంగా బతుకుతున్నారు.
కరీంనగర్క్రైం: జైలుకు వెళ్లిన తర్వాత సమాజం, కుటుంబాలకు దూరమైన వారు బయటకు వచ్చాక జీవితం ఎలా ఉంటుందోనన్న భయంతో ఉంటారు. కానీ జైళ్లలో ఖైదీలుగా ఉన్న సమయంలో వారిలో పరివర్తన కనిపించింది. చేసిన తప్పును తెలుసుకున్నారు. ఇక జీవితంలో ఎలాంటి పొరపాటు చేయబోమని వారు మనసులో ప్రతిజ్ఞబూనారు. జైలులో ఉన్న సమయంలో కౌన్సెలింగ్, వృత్తి నైపుణ్య శిక్షణ వారిలో మార్పునకు నాంది పలికింది. బయటకు వచ్చిన తర్వాత అనుమానాల గాలులు ఎదురైనా, తడబడకుండా ముందుకు సాగుతున్నారు. సమాజం చేయూతనిస్తే నేరజీవితం నుంచి పూర్తిగా బయటపడే అవకాశం కలుగుతుంది. శిక్షతోనే కథ ముగియదని అవకాశం ఇస్తే కొత్త జీవితాలు ప్రారంభమవుతాయని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
30 మందికి కొత్త జీవితాలు
వివిధ కేసుల్లో శిక్షకాలం పూర్తయిన 30 మంది ఖైదీలు కరీంనగర్ జైలు నుంచి విడదలయ్యారు. వీరిలో 22 మంది కరీంనగర్ జైలు ప్రాంగణంలోని పెట్రోల్బంక్లో, మిగతా 8 మంది బొమ్మకల్ జైలుబంకులో పనిచేస్తున్నారు. ఇలా నెలకు రూ.16,500 వరకు ఆదాయం పొందుతున్నారు.
ఖైదీల ఉపాధికి జైళ్లశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జైలులోని ఖైదీలకు పెట్రోల్బంకులో పనిచేయడం, బెంచీల తయారీ, అగరబత్తుల తయారీతోపాటు వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నాము. జైలు పెట్రోల్బంకు 2017లో ప్రారంభించాం. 30 మంది విడుదలైన ఖైదీలకు బంకులో ఉపాధి కల్పించాం. జైలు శిక్ష అనంతరం విడుదలైన వారికి ఉపాధి కల్పిస్తున్నాం.
– విజయ్ధేని, కరీంనగర్ జిల్లా జైలు
సూపరింటెండెంట్
జైలుదిద్దిన జీవితాలు!


