ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ‘చలో సెక్రటేరియల్’
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న చలో సెక్రటేరియల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ధామన్రెడ్డి ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో చలో సెక్రటేరియల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ వెంటనే ప్రారంభించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర నాయకులు కాళిదాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎంపీరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి రమణారావు, ఏఐటీయూసీ నాయకులు టేకుమల్ల సమ్మయ్య, కొంరయ్య, మనోహర్, జీపీసింగ్ తదితరులు పాల్గొన్నారు.


