అన్నా.. నేను చనిపోతున్నా.. | - | Sakshi
Sakshi News home page

అన్నా.. నేను చనిపోతున్నా..

Feb 19 2026 10:11 AM | Updated on Feb 19 2026 10:11 AM

అన్నా.. నేను చనిపోతున్నా..

అన్నా.. నేను చనిపోతున్నా..

కరీంనగర్‌రూరల్‌: ‘అన్నా అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నా.. నేను చనిపోతున్నా’ అంటూ ఓ వివాహిత పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని తీగలగుట్టపల్లిలో చోటు చేసుకుంది. కరీంనగర్‌ రూరల్‌ సీఐ నిరంజన్‌ రెడ్డి వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన లింగంపల్లి మమత(29), తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేశ్‌ 14 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో నివాసం ఉండేవారు. నరేశ్‌ సింగరేణి వన్‌ ఇంకై ్లన్‌లో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే వీరు గంగానగర్‌లోని అద్దె ఇంట్లోకి మారారు. వివాహమైన నెలరోజుల నుంచి మమత భర్త నరేశ్‌, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవిత కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. మమత విషయాన్ని తన సోదరుడు మహేశ్‌కు చెప్పడంతో రూ.లక్ష ఇచ్చాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో నస్పూర్‌కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లింది. మరునాటి రోజు ఉదయం గోదావరిఖనిలోని గంగానగర్‌ ఇంటి యజమాని మమతకు ఫోన్‌చేసి నరేశ్‌ మెట్లవద్ద పడి ఉన్నాడని చెప్పాడు. నరేశ్‌ను సింగరేణి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి మమత చికిత్స అందిస్తోంది. మంగళవారం ఆస్పత్రి వద్ద మమత, తన సోదరుడు మహేశ్‌ను నరేశ్‌ తల్లిదండ్రులు దూషించారు. దీంతో అక్కడి నుంచి మమత వెళ్లిపోయిది. మధ్యాహ్నం మహేశ్‌కు ఫోన్‌చేసి అత్తింటి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తాను చనిపోతున్నానని చెప్పింది. మహేశ్‌ డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వగా, పోలీసులు లొకేషన్‌ ట్రేస్‌ చేశారు. తీగలగుట్టపల్లిలోని హనుమాన్‌నగర్‌ రైల్వే ట్రాక్‌ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులు, మహేశ్‌ అక్కడికి చేరుకోగా.. మమత అప్పటికే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతదేహాన్ని కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సోహం సునీల్‌, కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌ కుమార్‌ పరిశీలించారు. మమత తండ్రి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేశ్‌తో పాటు అత్తింటివారిపై బుధవారం క్రిమినల్‌ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లిలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement